Farm House Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది. అటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ను రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. నందకుమార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అక్రమ కట్టడాల ద్వారా చీటింగ్ చేసిన డబ్బును ఏం చేశారని ఆరా తీస్తున్నారు.
ఫిలింనగర్ లోని హీరో దగ్గుబాటి రానా, సురేష్ బాబు భూమిని నందకుమార్ లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్న భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని గతంలో జీహెచ్ఎంసీతోపాటు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కొద్దిరోజుల క్రితం కూల్చివేశారు. అక్రమ కట్టడాలను అద్దెకు ఇచ్చి చీటింగ్ చేశారని నందకుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది.
నందకుమార్ మోసం చేయడం వల్ల రూ.70 లక్షలు నష్టపోయామని సయ్యద్ అయాబ్, సంజయ్ అనే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెక్కన్ కిచెన్ స్థలాన్ని లీగల్ రైట్స్ లేకున్నా అగ్రిమెంట్ చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే నందకుమార్ పై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్రమ కట్టడాల అద్దె ద్వారా వచ్చిన సొమ్ము నందకుమార్ ఎటు మళ్లించారన్న కోణంలో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు నివేదికలు ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలకం కానున్నాయి.