Gudivada Amarnath: రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వానివేనని.. జగన్ నివాసం కోసం నిర్మించినవి కాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రుషికొండ భవనాల అంశంపై మీడియాతో ఆయన మాట్లాడారు. రుషికొండ భవనాలు కేవలం జగన్వే అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఫ్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే రుషికొండ భవనాల నుంచే జగన్ పరిపాలన కొనసాగించే వారిని అన్నారు. కానీ ప్రజా తీర్పు మరోలా వచ్చిందని చెప్పుకొచ్చారు.
రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశాన్ని వదిలేసి, వాటిని జగన్ సొంత భవనాలనే అనే లాగా చిత్రీకరించడాన్ని మూనుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని తెలిపారు. అందుకు అనేక అడ్డంకులు సృష్టించారని అన్నారు. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాతే రిషికొండ భవనాలను నిర్మించనట్లు వెల్లడించారు.
Also Read: జగన్ ఇంటికి భద్రత, 30 మంది ప్రైవేటు సెక్యూరిటీ
టీడీపీపై తాము విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని అంటారనే ఉద్దేశంతో అలాంటి విషయాల జోలికి పోవడం లేదన్నారు. నగరానికి రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ వంటి పలువురు ప్రముఖులు వస్తే రిషికొండ భవనాలను వారి ఆతిథ్యానికి వాడుకోవచ్చని తెలిపారు. ప్రజలిచ్చిన అధికారాన్ని తమకంటే మంచి చేయడానికి ఉపయోగించాలే కానీ ప్రజలను తప్పు దోవ పట్టించడానికి కాదని హితవు పలికారు.