MP Aravind : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య పొలిటికల్ వార్ మరింత హీటెక్కుతోంది. తాజాగా కవితపై తెలంగాణ హైకోర్టులో అరవింద్ పిటిషన్ దాఖలు చేశారు. తనను చంపుతానని మీడియా సాక్షిగా బెదిరించిన కవితపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆమెపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నవంబర్ 18న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఎంపీ అరవింద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో అరవింద్ ను చెప్పుతో కొడతానని హెచ్చరించారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తామని సవాల్ చేశారు.
మరోవైపు హైదరాబాద్లోని ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ , బీజేపీ మధ్య రాజకీయం మరింత హీటెక్కింది. తాజాగా కవిత విషయంలో అరవింద్ కోర్టుకు వెళ్లడం మరింత ఆసక్తి రేపింది.
తనను బెదిరించడంతోపాటు తన కుటుంబసభ్యులను అవమానించిన కవితపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టులో వేసిన పిటిషన్లో ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పిటిషన్ ను జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించనుంది. అరవింద్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించనున్నారు. మరి అరవింద్ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది.