Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. కేసును హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని.. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో వివేకానందరెడ్డి హత్య కేసు కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యింది.
తన తండ్రి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును తెలంగాణకు బదిలీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఏపీలో సంచలనం సృష్టించింది. నిందితుడిగా ఉన్న దస్తగిరి అఫ్రూవర్ గా మారడంతో ఈ కేసు కీలక ములుపు తిరిగింది.