Another shock to BRS MLA Bandla: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడు తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపో మపో రానుంది. ఇందులో భాగంగా విపక్ష కారు పార్టీ ఎమ్మెల్యేలు.. అధికార కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కారు దిగే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్లకు గాను కేవలం రెండు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. అందులో ఒకటి ఆలంపూర్ కాగా, మరొకటి గద్వాల్. ఇక్కడి నుంచి బండ్ల కృష్ణమోహన్రెడ్డి గెలుపొందారు.
కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులను ఆ పార్టీ ఎమ్మెల్యేలు గమనిస్తున్నారు. మునిగి పోయే నావలో ఉండే బదులు ముందుగా ఇల్లు చక్కబెట్టుకుంటే బెటరని ఆలోచనలో చేస్తున్నారట. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనే విపక్ష కంటే అధికార పార్టీయే బెటరని పలువురు నేతలు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మంత్రి జూపల్లితో చర్చలు జరిపినట్లు వార్తలు జోరందుకున్నాయి. పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఉంటుందని మంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్లో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు అంతర్గత సమాచారం. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కీలక పెద్దలు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో మంతనాలు జరిపారు. పార్టీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వీడవద్దని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ: నిద్ర లేదు.. సుఖం లేదు.. కేసీఆర్ కు భయం మొదలైందా?
తనను నమ్మి గెలిపించిన కేడర్కు న్యాయం చేయాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా పనులు జరుగుతాయని, లేకుంటే విపక్షంలో కష్టమని భావిస్తున్నట్లు ఇన్సైడ్ సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే రెండురోజుల్లో ఆయన ప్రకటన చేయనున్నారు. ఈయనేకాకుండా మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ అధికార కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు జోరందుకున్నాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల వచ్చేనాటికి ఎంతమంది ఎమ్మెల్యేలు కారు పార్టీ నుంచి తప్పుకుంటారో చూడాలి.