Fire accident in government hospital: అగ్నిప్రమాదాల విషయంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిత్యం ఎక్కడో ఓ చోట సంభవిస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ ప్రమాదాల బారిన పడి పలువురు గాయపడుతున్నారు. పలు ప్రమాదాల్లో పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోపాటు జిల్లాల్లోనూ అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో కలకలం రేగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన పలువురు సిబ్బంది రోగులను అలర్ట్ చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. భయంతో రోగులు పరుగులు తీశారు. అంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం డయాలసిస్ కేంద్రానికి సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రి 7.30 గంటలకు అందులోంచి నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే అలర్ట్ అయిన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు పంపించారు. ఇటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మంటల దాటికి డయాలసిస్ కేంద్రంలో ఉన్న మెడికల్ సామాగ్రి కాలిబూడిదైనట్లు సమాచారం.
Also Read: నర్సాపూర్ డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. కొడుకే హంతకుడు
అయితే, ఒక్కసారిగా ఈ హఠాత్పరిణామం చోటు చేసుకోవడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. కదల్లేని పరిస్థితిలో ఉన్న రోగులను తమ కుటుంబ సభ్యులు స్ట్రెచర్స్, మంచాలపైనే ఉంచి బయటకు తీసుకువచ్చారు. అంతా ఆసుపత్రి నుంచి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయ్యింది.