Jagan controversy: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్ చేసిన తప్పులను గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. తాజాగా మాజీ సీఎం జగన్ వినియోగిస్తున్న ఫర్నీచర్పై ఇంటా బయటా రచ్చ తారాస్థాయికి చేరింది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు జగన్పై కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని కోడెల శివరామ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మురిదిపాకాన పడింది.
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ చావు దెబ్బతింది. గత ఎన్నికల్లో 151 సీట్లను గెలిచిన ఆ పార్టీ, ఈసారి ఎన్నికల్లో ఆ సంఖ్య 11కు పడిపోయింది. ముఖ్యంగా జగన్ అవలంభించిన విధానాలే ఇందుకు కారణంగా చెబుతున్నాయి. ఇప్పుడు అసలు రచ్చ మొదలైంది. జగన్ అధికారంలో ఉండగా సెక్రటేరియట్ పేరుతో తీసుకున్న ఫర్నీచర్ తిరిగి అప్పగించకుండా వినియోగిస్తున్నారు. ఆయన వినియోగిస్తున్న ఫర్నీచర్ విలువ అక్షరాలా 9 కోట్ల రూపాయలుగా ప్రచారం సాగుతోంది. ఏసీలు, టేబుళ్లు, సోఫాలు, కుర్చీలు, వీడియో, టెలికాన్ఫరెన్స్లకు వినియోగించిన వస్తువులు ఉన్నాయి. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఫర్నీచర్ను వినియోగించుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఏపీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ సొంతానికి ఫర్నీచర్ వాడుకున్నారని ఆయన్ని వేధించింది ప్రభుత్వం. చివరకు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కోడెల శివప్రసాద్ కొడుకు శివరామ్ రియాక్ట్ అయ్యారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో మాజీ సీఎం ఫర్నిచర్ ఇతర ఖర్చుల కోసం 9 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ALSO READ: చిక్కుల్లో పొన్నవోలు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు..
ఈ వ్యవహారంపై వైసీపీ కూడా రియాక్ట్ అయ్యింది. ఆ ఫర్నీచర్ విలువ ఎంత వాపసు చెయ్యాలో చెబితే డబ్బు చెల్లిస్తామంటున్నారు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి. జగన్ మాత్రం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. కాకపోతే ఈ వ్యవహారంపై నేతలతో కూడా ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది.