Bandi Sanjay : బండి సంజయ్ జోరు మామూలుగా లేదు. యాత్ర విషయంలో తగ్గేదేలే అంటున్నారు. పోలీసులు పర్మిషన్ నిరాకరించడం.. హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకోవడంతో.. బీజేపీలో ఫుల్ జోష్. హైకోర్టు కండిషన్ల మేరకు తన ఐదవ విడత పాదయాత్ర రూటులో స్వల్ప మార్పులు చేశారు. నిర్మల్ జిల్లాలో మకాం వేశారు బండి సంజయ్.
పాదయాత్రను అడ్డంకులు సృష్టిస్తున్నారని.. భైంసాకు దూరం చేశారేమో కానీ భైంసా ప్రజల నుంచి తనను దూరం చేయలేరన్నారు సంజయ్. బైంసా వెళ్లాలంటే వీసా కావాలా? అనుమతి తీసుకోవాలా? భైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా? అంటూ ప్రశ్నించారు.
భైంసాలో అల్లర్లు సృష్టించిందెవరు? ఆ అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నది ఎవరు? పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరు? మేం భైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే భైంసాకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. గతంలో పాతబస్తీలో పాదయాత్రను ప్రారంభించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. కొత్త రూట్ మ్యాప్ ప్రకారం మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.