Ahmed Shehzad Demands That PCB To Sack Pcb These Five Pakistan Players: టీ 20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంటులో పాకిస్తాన్ గ్రూప్ దశ నుంచి వైదొలగింది. ఇంతవరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ దేశ సీనియర్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవకాశాలిచ్చినా వారి తీరు మారడం లేదని మండి పడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఐదుగురు క్రికెటర్లు పాకిస్తాన్ తరఫున ఆడుతున్నారని, ఇంకా మెగా టోర్నమెంటుల్లో ఎలా ముందుకెళ్లాలో వారికి తెలీడం లేదని విమర్శిస్తున్నారు.
ముందు ఆ ఐదుగురిని తీసివేయమని పాకిస్తాన్ బోర్డుకి సూచించిన వారిలో పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద ఉన్నాడు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే.. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, హరిస్ రవూఫ్, ఫకర్ జమాన్, షహీన్ ఆఫ్రిది పేర్లు తెలిపాడు. వీళ్లని తీస్తేనేగానీ పాకిస్తాన్ క్రికెట్ బాగుపడదని తెలిపాడు. వ్యక్తిగత రికార్డులకే వాళ్లు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పాకిస్తాన్ కి ఈ గతి పట్టిందని అన్నాడు.
వీళ్లందరి కెరీర్ చూస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ గెలిచిన మ్యాచ్ లు చూస్తే తక్కువగా ఉంటాయి. రికార్డులెందుకు? నెత్తినేసి కొట్టుకోడానికా? అన్నాడు. ఇప్పుడు బాబర్ అజామ్ టీ 20ల్లో విరాట్ కొహ్లీ స్కోరు దాటాడు. పాకిస్తాన్ కి ఏం ఉపయోగం? జట్టుకేం లాభమని అన్నాడు. వీళ్ల ఆట, వీళ్లు ఆడేసి వెళ్లిపోతారు. కానీ సమష్టిగా జట్టుని గెలిపించే శక్తి సామర్థ్యాలు లేవని అన్నాడు. వీళ్లలో వీళ్లకి మనస్పర్థలు ఉన్నాయి. అవెప్పటికి సమసిపోవని అన్నాడు.
అదే టీమ్ ఇండియాని చూస్తే, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య మనస్పర్థలు వచ్చాయని అందరికీ తెలిసిందే. కానీ ప్రపంచకప్ కి వచ్చేసరికి రోహిత్ శర్మ.. ప్రతీ ఓవర్ కి వెళ్లి పాండ్యాను అడుగుతున్నాడు. ఫీల్డింగ్ నీకెలా కావాలి? అంటున్నాడు. లేదా ఈ సమయంలో ఈ బాల్స్ వేయమని సూచిస్తున్నాడు. ఆ టీమ్ వర్క్ పాకిస్తాన్ లో లోపించిందని అన్నాడు. జట్టులో బాబర్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించాడు.
బాబర్ అజామ్ నాలుగైదేళ్లుగా కెప్టెన్ గా ఉన్నాడు. కానీ వెనక్కితిరిగి చూసుకుంటే అతను సాధించినదేమీ లేదని అన్నాడు. తనకి ఫిట్ నెస్ కూడా లేదని విమర్శించాడు. యువ ఆటగాళ్లపై నిందలు వేయకుండా సీనియర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని షెహజాద్ కోరాడు. జట్టునే కాదు ఏకంగా పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీని కూడా కాసేపు వేసుకున్నాడు. తను చైర్మన్ అయిన తర్వాత రెండు తప్పులు చేశాడని అన్నాడు.
Also Read: టీ20 ప్రపంచ కప్.. టాస్ పడకుండానే ఇండియా-కెనడా మ్యాచ్ రద్దు
ఒకటి బాబర్ అజామ్ ని తిరిగి కెప్టెన్ గా నియమించాడు. రెండోది వాహబ్ రియాజ్ ను చీఫ్ సెలక్టర్ గా చేశాడు. ఈ విషయంలో నక్వి అనైతికంగా వ్యవహరించాడు. ఫలితం టీ 20 ప్రపంచకప్ లో కనిపించిందని ఘాటుగా విమర్శించాడు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లను తొలగించవద్దనే ఒత్తిడి ఉంటే ఎవరు మాత్రమేం చేస్తారు? మన పక్కదేశాలు ఆడుతుంటే, మనం చూస్తూ ఉండటమేనని విమర్శించాడు.
మొత్తానికి షెహజాద్ చేసిన విమర్శలు పాకిస్తాన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మాటల నేపథ్యంలో మిగిలినవాళ్లు కూడా నోళ్లు తెరుస్తున్నారు. ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది.