Delhi AIIMS: ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద హ్యాకింగ్ ఇది. సైబర్ నేరగాళ్లు ఇండియాపై పంజా విసిరారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేశారు. ఇది జరిగి వారం అవుతోంది. ఇంత వరకూ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. అంతలోనే హ్యాకర్ల నుంచి మెసేజ్ వచ్చింది. 200 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కి దిగారు. అదికూడా క్రిప్టో కరెన్సీలోనే చెల్లించాలంటూ కండిషన్ కూడా పెట్టడం కలకలం రేపుతోంది.
వారం రోజులుగా హాస్పిటల్ లో సర్వర్లు పని చేయడం లేదు. సుమారు 3-4 కోట్ల మంది రోగుల సమాచారం అందులో ఉంది. వారిలో మాజీ ప్రధానులు, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు, పలువురు వీఐపీలకు సంబంధించి ఆరోగ్య సమాచారం కూడా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
హ్యాకర్ల దాడిపై ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN), ఢిల్లీ పోలీసులు, హోంమంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. దోపిడీ, సైబర్ ఉగ్రవాదం అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇ-హాస్పిటల్ డేటా బేస్ను పునరుద్ధరించారు. ఎయిమ్స్ నెట్వర్క్ను పూర్తిగా యాంటీ వైరస్ ద్వారా స్కాన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఐదు రోజుల పాటు కొనసాగనుందని తెలుస్తోంది. ఆస్పత్రిలోని కంప్యూటర్లు అన్నింటికీ ఇంటర్నెట్ కట్ చేశారు.
మరోవైపు, సర్వర్లు నిలిచిపోవడంతో వారం రోజులుగా ఆస్పత్రిలోని ప్రక్రియ అంతా మాన్యువల్గానే జరుగుతోంది.
ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, లేబోరేటరీ లాంటి సేవలన్నీ మాన్యువల్గానే నిర్వహిస్తున్నారు.
మరి, హ్యాకర్లు డిమాండ్ చేసినట్టు డబ్బులు చెల్లిస్తారా? లేదంటే, మనోళ్లే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా? చూడాలి..