FarmHouse Case : ఫాంహౌజ్ కేసు అటూఇటూ తిరుగుతోంది. ఓసారి సిట్ ది అప్పర్ హ్యాండ్ అయితే, ఇంకోసారి నిందితులది. హైకోర్టు స్టే తో కేసులో కీలకమైన బీఎల్ సంతోష్ ప్రస్తుతానికైతే సేఫ్. అయితే, డిసెంబర్ 5 తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. ఇంతలోనే మరో ఆసక్తికర పరిణామం.
సిట్ నోటీసులపై కేరళకు చెందిన తుషార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది మామూలు విషయమే అయినా.. పిటిషన్ లో కేసీఆర్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం ఇంట్రెస్టింగ్ పాయింట్. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తుషార్.
ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి పిటిషన్ వేశారు. ఈ కేసులో సిట్ విచారణపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు.
ఈ నెల 21న విచారణకు రావాలని 41ఏ సీఆర్పీసీ కింద తనకు నోటీసు ఇచ్చారని.. అనారోగ్యం వల్ల వైద్యుల సూచన మేరకు 2 వారాల గడువు కోరుతూ మెయిల్ చేసినట్టు పిటిషన్ లో వివరించారు. అయితే, మెయిల్కు సమాధానం ఇవ్వకుండా తనపై లుకౌట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమే అవుతుందన్నారు తుషార్.
సిట్ నోటీసులు అందుకున్న తుషార్, జగ్గుస్వామిలు ఇప్పటి వరకూ విచారణకు హాజరు కాలేదు. వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండగా.. తుషార్ ఇలా హైకోర్టులో పిటిషన్ వేయడం, నేరుగా కేసీఆర్నే టార్గెట్ చేయడం, సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోననే టెన్షన్.