CM KCR: కార్పొరేట్, ప్రైవేటు వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామన్నారు సీఎం కేసీఆర్. దామరచర్లలోని యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవన్ ప్లాంట్ పనులు పరిశీలించారు. హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ నిర్వహించి ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. 5 వేల ఎకరాల్లో 29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 5 యూనిట్లను సీఎం పరిశీలించారు.
విద్యుత్ కేంద్రంలో కనీసం 30 రోజులకి అవసరమయ్యే బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పవర్ ప్లాంట్కు ప్రతిరోజు బొగ్గు, నీరు ఎంత అవసరం అవుతుందని అధికారులను ప్రశ్నించారు. కృష్టా జలాలను ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
విద్యుత్ కేంద్రంలో పనిచేసే సుమారు 10వేల మందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్షిప్ నిర్మాణం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సిబ్బంది క్వార్టర్స్, ఇతరత్రా సదుపాయాల కోసం ప్రత్యేకంగా వంద ఎకరాలు సేకరించాలన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 50 ఎకరాలు.. ఇతర అవసరాలకు మరో 50 ఎకరాలు వినియోగించాలని చెప్పారు. విద్యుత్ కేంద్రానికి భూమి ఇచ్చిన రైతులతోపాటు గతంలో సాగర్ ప్రాజెక్టుకు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో పాటు జిల్లా కలెక్టర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నిర్మాణ పనుల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు వివరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండు యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు.. మిగతావి 2024 జూన్లోపు పూర్తవుతాయని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సీఎంకు వివరించారు.
2015లో యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం కంప్లీట్ అయ్యాయి. తాజగా, సీఎం కేసీఆర్ పరిశీలనతో నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ముఖ్యమంత్రి వెంట ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా తరలి వెళ్లారు.