Heavy Rain Alert in Telangana(TS news updates): వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణశాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా చురుగ్గా ఉన్నాయని పేర్కొంది. దీనితోపాటు రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా.. మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ఉందని తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూ ల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. హైదరాబాద్ లోనూ వర్షాలు పడతాయని తెలిపింది.
మరోవైపు నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిన్న ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీగా వీచిన ఈదురుగాలులకు చెట్లు విరిగి కరెంట్ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వేములవాడ రాజన్న ఆలయం ఎదుట రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో శుక్రవారం 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతో రామాలయం వద్ద ఉన్న అన్నదాన సత్రం చుట్టూ నీళ్లు చేరి చెరువును తలపించింది. నిన్న ఒక్కరోజే కురిసిన వర్షానికి స్లూయిస్ బ్రేక్ అవ్వడంతో అన్నదాన సత్రంలోకి నీళ్లు చేరాయి.