Nepal vs South Africa Highlights T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో అతి సాధారణ జట్టుగా వచ్చిన నేపాల్ ఒక్కసారి విజృంభించి సౌతాఫ్రికాను వణికించి, ఓడించినంత పనిచేసింది. చివరి బాల్ వరకు నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది. చివరికి ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించి బతుకు జీవుడా అని బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. గ్రూప్ డిలో ఉన్న నేపాల్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ వెస్టిండీస్ లో జరిగింది. టాస్ గెలిచిన నేపాల్ జట్టు మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. దీంతో సౌతాఫ్రికా విజయం సాధించి గ్రూప్ డిలో 8 పాయింట్లతో సూపర్ 8 కి ఘనంగా దూసుకెళ్లింది.
116 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నేపాల్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కుషాల్ (13) తక్కువ పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ మాత్రం ఒంటరిగా నిలిచాడు. 49 బంతుల్లో 1 సిక్సర్, 4 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ రోహిత్ పౌడల్ డక్ అవుట్ అయ్యాడు. సెకండ్ డౌన్ వచ్చిన అనిల్ కుమార్ షా (27) కాసేపు పోరాడాడు. కానీ కివీస్ బౌలర్ల ధాటికి నిలువలేక పోయాడు.
ఈ దశలో గుల్షాన్ ఝా (6), సోంపాల్ కామి (8) చివరి బంతి వరకు పోరాడి, అందరిలో ఆశలు రేపారు. అయితే అనూహ్యంగా గుల్షాన్ చివర్లో రన్ అవుట్ అయిపోయాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో నేపాల్ పరాజయం పాలైంది. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ సౌతాఫ్రికాను వణికించిన జట్టుగా టీ 20 ప్రపంచకప్ చరిత్రలో తన పేరు లిఖించుకుంది.
సౌతాఫ్రికా బౌలింగులో అన్రిచ్ 1, తబ్రైజ్ షంశి 4, మార్క్రమ్ 1 వికెట్ పడగొట్టారు.
Also Read: పసికూన ఉగండాపై.. 5.2 ఓవర్లలో కివీస్ ఘనవిజయం
అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకి కూడా సరైన శుభారంభం దక్కలేదు. సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (10) చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ రీజా హేండ్రిక్స్ 49 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
కెప్టెన్ మార్క్రమ్ వచ్చి కేవలం 15 పరుగులు చేసి తను అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం 18 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. మిగిలిన వారెవ్వరూ పెద్ద స్కోర్లు చేయలేదు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.
నేపాల్ బౌలింగులో దీపేంద్ర సింగ్ 3, కుశాల్ 4 వికెట్లు పడగొట్టారు.