Minister Dharmendra Pradhan on NEET 2024: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ పై లీకేజీ ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పరీక్ష రాసి.. అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ లో పాల్గొనాలో లేదోనన్న అయోమయంలో పడ్డారు. నీట్ కౌన్సెలింగ్ ను ఆపివేయాలని దాఖలైన పిటిషన్ పై ఇటీవలే సుప్రీంకోర్టు స్టే విధించింది. తాజాగా నీట్ 2024పై వస్తున్న ఆరోపణలపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
నీట్ 2024పై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. అభ్యర్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులు ఎలాంటి అనుమానాలు లేకుండా కౌన్సెలింగ్ లో పాల్గొనాలని కోరారు. నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న క్రమంలో.. ఇలాంటి ఆరోపణలు చేసి.. వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు సూచించిన దానిప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోడానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Also Read : నీట్ కౌన్సెలింగ్ పై స్టే కు సుప్రీం నిరాకరణ.. కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు
గ్రేస్ మార్కులు కేటాయించిన 1563 మంది విద్యార్థులకు మళ్లీ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షల్లో లీకేజీలను అరికట్టేందుకు, కాపీ లేకుండా ఉండేందుకు కేంద్రం పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్యాయ మీన్స్ యాక్ట్ ను ఆమోదించిందన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. అందులో కఠినమైన నిబంధనలు ఉన్నాయన్న ఆయన.. కాంగ్రెస్ కు విద్యార్థుల భవిష్యత్ పై రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదన్నారు. దేశ అభివృద్ధికి కాంగ్రెస్ సహకరించాలని కోరారు.జులై 3న నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా.. నీట్ పై వచ్చిన పిటిషన్ల తదుపరి విచారణను సుప్రీం జులై 6కు వాయిదా వేసింది.