Vegetables Price Increased in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. రోజురోజుకు ధరలు పెరగడంతో సామాన్యుడికి అందకుండా పోతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు అన్ని రకాల ధరలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే..పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
సమస్య ఇదేనా
డిమాండ్ తగిన విధంగా ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయలు కుళ్లిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీనికితోడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలను తెస్తున్న సమయంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. వర్షాలతో కూరగాయలు త్వరగా కుళ్లిపోవడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. మరో వైపు రాష్ట్రంలో కూడా కూరగాయల సాగు తగ్గింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.
30 నుంచి 40 శాతం పెరిగిన ధరలు
ఏపీ, తెలంగాణలో కూరగాయ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. మార్కెట్ అవసరాలకు సరిపడా కూరగాయల ఉత్పత్తి జరగడం లేదు. దీంతో 30 నుంచి 40 శాతం వరకు కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఏ రకం కూరగాయాలు చూసిన రైతు బజారులోనే కిలో 60 నుంచి 80 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్లో రైతు బజారులో కేజీ ఉల్లి రూ.35 ఉంటే..ఒపెన్ మార్కెట్లో రూ.40 నుంచి 45 వరకు పలుకుతుంది. టమాట కిలో రూ.40 నుంచి 50, పచ్చిమిర్చి రూ. 65 నుంచి 80, బీన్స్ రూ.110 నుంచి 120, చిక్కుడు రూ.50 నుంచి 60, బెండకాయ రూ.50 నుంచి 60 మధ్య ఉన్నాయి. ఆకుకూరలు సైతం రెట్టింపు అయ్యాయి.
మరో రెండు నెలల్లో..
ప్రస్తుతం వర్షా కాలం ప్రారంభం కానుంది. దీంతో రైతులు వానకాలం సాగు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన పంట జులై, ఆగస్టు మాసంలో చేతికి వస్తుంది. ఈ ఉత్పత్తులు మార్కెట్లకు చేరితే మళ్లీ కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
Tags
Share