Ruthuraj Gaikwad : విజయ్ హజారే ట్రోఫిలో మహారాష్ట్ర కెప్టెన్ , ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. యూపీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పెను విధ్వంసం సృష్టించాడు. డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరో అరుదైన రికార్డు సాధించాడు.
ఒకే ఓవర్ లో 7 సిక్సులు
రుతురాజ్ ఒకే ఓవర్ లో 7 సిక్సులు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ లో ఈ ఫీట్ సాధించాడు. శివ సింగ్ ఆ ఓవర్ లో 5 బంతిని నోబాల్ వేశాడు. దీంతో ఆ ఓవర్ లో 7 బాల్స్ వేయాల్సి వచ్చింది. మొత్తం 7 బంతులను సిక్సులుగా మలిచి రుతురాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో ఆ ఓవర్ లో మొత్తం 43 పరుగులు వచ్చాయి. ఆ బౌలర్ శివ సింగ్ ఈ మ్యాచ్ లో 9 ఓవర్ల వేసి 88 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అందులో 66శాతం పరుగులు రుతురాజ్ సాధించినవే కావడం విశేషం. ఎక్సట్రాలు కలిపి మిగతా బ్యాటర్లు చేసినవి 110 పరుగులు మాత్రమే.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గారీ సోబర్స్ , రవిశాస్త్రి ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో యువరాజ్ సింగ్, హెర్షల్ గిబ్స్ ఈ ఘనత సాధించారు.
డబుల్ సెంచరీతో విధ్వంసం
ఓపెనర్ గా దిగిన రుతురాజ్ 159 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 16 సిక్సులతో 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది లిస్ట్ ఏ క్రికెట్ 39వ డబుల్ సెంచరీ. భారత్ తరఫున ఐదో వ్యక్తిగత టాప్ స్కోర్. ఇటీవల తమిళనాడు బ్యాటర్ జగదీశన్ అరుణాచల్ ప్రదేశ్ పై 277 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వారంలోపే రుతురాజ్ డబుల్ సెంచరీతో విధ్వంసం చేశాడు.