Man Killed in Balapur PS Limits(Hyderabad news today): రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో దారుణ ఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు.. సయ్యద్ సమీర్ అనే వ్యక్తిని తల్వార్ తో నరికి చంపారు. డెకరేషన్ వర్క్ చేసే సమీర్.. గురువారం రాత్రి రాయల్ కాలనీ నుంచి ఇంటికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా.. బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సమీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. స్థానికులను విచారించి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కాగా.. సమీర్ హత్య జరిగిన ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు గంజాయి సేవించి తరచూ గొడవలకు పాల్పడుతుంటారని, సమీర్ హత్యకు కూడా అదే కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అబ్దుల్ ఖద్దూస్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.