Ramdevbaba : మహిళల వస్త్రధారణ విషయంలో చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు.
వివాద నేపథ్యం
దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారని ఇటీవల రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు రాందేవ్ బాబా వివరణ ఇచ్చారని మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విటర్లో వెల్లడించారు. రాందేవ్ పంపిన క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు.
లేఖ సారాంశం
“మహిళలు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం లేదు. సోషల్మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని రాందేవ్ బాబా ఆ నోటీసులకు సమాధానమిచ్చారు.
అసలేం జరిగిందంటే..
గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠానే నగరంలో పతంజలి యోగా పీఠ్, ముంబయి మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా ఫడణవీస్ సహా పలువురు మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే అక్కడ ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. దీంతో యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు.. వాటిని మార్చుకొని, చీరలు ధరించేందుకు సమయం దొరకలేదు. ఆ పరిస్థితిపై స్పందించిన రామ్దేవ్.. స్త్రీలు చీరల్లో, సల్వార్ సూట్లలో అందంగా ఉంటారని.. తనలాగా అసలేం ధరించకపోయినా బాగుంటారని నోరు జారారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.