Mumtaz Zahra Baloch: ఇండియాలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికసీట్లను కైవసం చేసుకున్న ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. పలువురు ఎంపీలుగా కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, భారత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమంటూ పాకిస్థాన్ పేర్కొన్నది. అదేవిధంగా భారత అంతర్గత వ్యవహారాలపైనా కూడా స్పందించబోమంటూ పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జాహ్రా బలోచ్ ఓ మీడియా సమావేశంలో తెలిపారు.
భారత్ లో జరిగిన ఎన్నికల గురించి మీడియా ప్రతినిధులు స్పందన కోరగా ముంతాజ్ జాహ్రా మాట్లాడుతూ.. ‘భారత్ లో ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధించి, లేదా.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు’ అంటూ బదులిచ్చారు. మోదీ విజయంపై ఇరు దేశాల ప్రధానుల మధ్య లేఖల మార్పిడి జరగలేదని, కానీ.. మోదీ ప్రమాణ స్వీకారం తరువాత ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో(ఎక్స్) ఓ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలను అభినందించడమనేది ఆనవాయితీ అంటూ ఆమె పేర్కొన్నారు. ‘ప్రధాని షరీఫ్ ఈ మేరకు స్పందించారు.. అటు మోదీ కూడా బదులిచ్చారు.. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ వివరణ ఇవ్వదల్చుకోలేదు’ అంటూ బలోచ్ బదులిచ్చారు.
Also Read: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..
అయితే, భారత ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన సోదరుడు, అధికార పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ లు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. కాగా, మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ఏడు పొరుగు దేశాలకు ఆహ్వానం పంపించారు. కానీ, ఇస్లామాబాద్ కు మాత్రం భారత్ ఆహ్వానం పంలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి రాలేదు.