AP Mega DSC update(Latest news in Andhra Pradesh): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక జీవోను జారీ చేసింది. మెగా డీఎస్సీపై గురువారం జీవోను విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టులను డిసెంబర్ 31 వరకు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్ పై సీఎం తొలి సంతకం చేశారు. ఈ మేరకు వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవోను జారీ చేసింది. వీటిలో.. ఎస్జీటీ – 6,371, పీఈటీ – 132, స్కూల్ అసిస్టెంట్స్ – 7725, టీజీటీ – 1781, పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ పోస్టులు 52 ఉన్నాయి.
ఇదిలా ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు అమరావతికి చేరుకుని సాయంత్రం సచివాలయానికి వెళ్లారు. ఆ తరువాత తన ఛాంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతోపాటు అధికారులు పాల్గొన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక తొలిసారిగా సచివాలయానికి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
Also Read: గ్రూప్ -2 అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్కు అవకాశం
పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. మొత్తం ఐదు ఫైళ్లపై సంతకం చేసిన సీఎం.. ఎన్నో ఏళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ అందించారు. మెగా డీఎస్సీ ఫైల్ పై సీఎం సంతకం చేయడంతో.. అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.