AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖల కేటాయింపు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంత్రుల సామర్థ్యం, అభీష్టాన్ని బట్టి శాఖలు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు గురువారం అమరావతి చేరుకుని, సాయంత్రం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లపై సంతకం చేశారు. మొత్తం ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. అందులో టీచర్ పోస్టుల భర్తీ డీఎస్సీ, పెన్షన్ పెంపుతో పాటు పలు అంశాలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు మంత్రులకు కేటాయించే శాఖల వివరాలు వెల్లడించే అవకాశముందని సమాచారం.
అయితే, పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రితోపాటు కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటు నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారని భావిస్తున్నారు.
Also Read: పూల బొకేలు.. శాలువాలు తీసకురావద్దు.. కార్యకర్తలకు జనసేనాని విజ్ఞప్తి..
ఇదిలా ఉంటే… రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం తరువాత తొలిసారిగా సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే.