Rahul Gandhi : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా సాగుతోంది. ఇండోర్ నగరంలో సైకిలు తొక్కి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టి పూలవర్షం కురిపించారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని మోవ్లో బైక్ నడిపారు రాహుల్ గాంధీ .
82వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇండోర్లోని బడా గణపతి చౌరహా నుంచి తిరిగి ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ రాహుల్ ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్నారు. సోమవారం బారోలి గ్రామం, కృష్ణా ఎన్క్లేవ్, తరణ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. రాత్రికి సన్విర్ వద్ద రాహుల్ బస చేయనున్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. చిన్నారులు, యువతతో కలిసి ఆడటం, గిరిజనులతో కలిసి నృత్యం చేయడం, స్థానికులతో సరదాగా గడపడం ఇలా సాగుతోంది భారత్ జోడో యాత్ర. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర సాగనుంది. ఈ యాత్రలో ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు, 34 జిల్లాలను చుట్టేశారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు 1,307 కిలోమీటర్ల దూరం నడిచారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు.