Farm House Case : చంచల్ గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్ ను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన చీటింగ్ కేసులో నందకుమార్ ను పోలీస్ కస్టడీలోకి తీసుకొనేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో రెండు రోజులపాటు నందకుమార్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు.
అటు ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. నందు వ్యాపారాలు, ప్రముఖులతో ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయాలని సిట్ భావిస్తోంది. ఫామ్ హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీలకు సీబీఐ కోర్టు డిసెంబర్ 9 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించింది. నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి నంద కుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రెండు రోజులపాటు ఆమెను ప్రశ్నించారు.
నందు భార్య చిత్రలేఖను మరోసారి విచారిస్తే మరిన్ని అంశాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. విచారణకు రావాలని ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేశారు. నందు ఆర్థిక లావాదేవీలపై ఆయన భార్య చిత్రలేఖతో చర్చించేవారని సిట్ అనుమానిస్తోంది. నందు, చిత్రలేఖ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలపై ఇప్పటికే సిట్ విచారణ చేసింది.