Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర రాజకీయ హీట్ ను పెంచేసింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఈ యాత్ర ప్రారంభించాలని సంకల్పించారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే ఈ రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కచ్చితంగా పాదయాత్ర అక్కడ నుంచే ప్రారంభిస్తానని బండి సంజయ్ స్పష్టం చేయడంతో బైంసాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు పాదయాత్రకు అనుమతి నిరాకరణపై బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ పోలీసులు కావాలనే అనుమతి రద్దు చేశారని పిటిషన్ లో పేర్కొంది. వారం క్రితం అనుమతిచ్చి … ఇప్పుడు కావాలనే రద్దు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ప్రజా సంగ్రామయాత్ర చేపట్టేందుకు బండి సంజయ్ కరీంనగర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. పాదయాత్రకు తొలుత అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. రూట్ మ్యాప్ ప్రకటించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలేంటని మండిపడ్డారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో బండి సంజయ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. అయితే అక్కడ నుంచి బండి సంజయ్ తప్పించుకున్నారు. కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
భైంసాలో బీజేపీ సభను కచ్చితంగా నిర్వహిస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భైంసా సున్నిత ప్రాంతం అంటున్నారని ఇదేమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు వెళ్లకూడదు? అని ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ బలపడటాన్ని ఓర్వలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. బండి పాదయాత్ర చేస్తే కేసీఆర్ కు భయమెందుకని ప్రశ్నించారు.
రెండు, మూడురోజులుగా ఎంపీ సోయం బాపూరావు, ఇతర నాయకులు భైంసాలోనే మకాం వేశారు. బైపాస్ రోడ్లో భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన డీసీసీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ ఈ సభా వేదికగానే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బీజేపీ టికెట్ ఆశావహులు భైంసా రహదారులను ఫ్లెక్సీలతో కాషాయమయం చేశారు. ఈ నేపథ్యంలో బండి యాత్రకు అనుమతి నిరాకరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.
ఎంఐఎంకు భయపడే సంజయ్ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని ఎంపీ సోయం బాపురావు విమర్శించారు.
బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించ తలపెట్టిన భైంసా సభకు అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు.
భైంసా నుంచి బండి సంజయ్ చేపట్టే పాదయాత్రకు అనుమతి లేదని భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారె తెలిపారు. భైంసాలో నిర్వహించే బీజేపీ సభకు అనుమతి లేదని స్పష్టంచేశారు. భైంసాలోని సున్నిత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రతోపాటు సభకు ఎస్పీ ప్రవీణ్కుమార్ అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు.