Surya Kumar Yadav Well Played : సూర్యకుమార్ యాదవ్ టీ 20 స్పెషలిస్ట్ బ్యాటర్. తనెంత విలువైన ఆటగాడు అన్నది మరొక్కసారి నిరూపించాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో కీలకమైన రెండు ప్రధాన వికెట్లు పడిపోయిన దశలో, మొక్కవోని ధైర్యంతో ఒకవైపు నిలబడిపోయాడు. అటు రిషబ్ పంత్ తర్వాత శివమ్ దుబెతో కలిసి జట్టుని గెలుపు తీరాలకు చేర్చాడు.
ఒకరకంగా చెప్పాలంటే ఒంటరిపోరాటం చేశాడని చెప్పాలి. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరే సీనియర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఇద్దరూ కూడా తగుదునమ్మా అంటూ ఓపెనర్లుగా వెళ్లి, చేతులు ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. నిజానికి అమెరికాతో మ్యాచ్ లో కోహ్లీ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పరిస్థితుల్లో పంత్ జాగ్రత్తగానే వికెట్లు కాపాడుకుంటూ ఆడాడు. తనకి తోడుగా సూర్యకుమార్ వచ్చాడు.
అంతకుముందు తను ఐర్లాండ్ మ్యాచ్ లో 2, పాకిస్తాన్ మ్యాచ్ లో 7 పరుగులు చేశాడు. ఇప్పుడు అమెరికాతో ఎంత చేస్తాడు రా నాయనా.. అంటూ అభిమానులు గుండెలు అరచేత పెట్టుకుని చూశారు. ఆ క్షణం జట్టు పరిస్థితిని సూర్య గమనించాడు. తన సహజశైలికి భిన్నంగా డిఫెన్స్ ఆడాడు. రన్స్ కన్నా వికెట్ ముఖ్యమని అనుకున్నాడు. అలా నెమ్మదిగా పిచ్ పై కుదురుకున్నాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు.
Also Read : రిషబ్ పంత్.. టీమ్ ఇండియాలో ఒకే ఒక్కడు..!
అప్పుడు వచ్చిన శివమ్ దుబెతో కలిసి మళ్లీ జాగ్రత్తగా పార్టనర్ షిప్ బిల్డప్ చేశాడు. దుబె రన్స్ కోసం కంగారుపడుతుంటే, తను గైడ్ చేసి ఆపేవాడు. లేదంటే బాల్ వస్తున్న మూమెంట్స్ ని తనకి వివరించాడు.
ఓవర్స్ అయిపోతుంటే కంగారేం లేదు, కూల్ గా ఉండమని.. అంతా సెట్ అవుతుందని హావభావాలతో చెప్పాడు. ఒకవైపు తను ఆడుతూనే, తనని కంట్రోల్ చేస్తూ ఆడాడు. ఇంతకుముందు ఈ పని విరాట్ కొహ్లీ చేసేవాడు.
మొత్తానికి దుబెతో కలిసి 72 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో టీమ్ ఇండియాని సూర్యకుమార్ గెలుపు తీరాలకు చేర్చాడు. నిజానికి గేమ్ ఛేంజర్ గా సూర్యకుమార్ మారి, తనంటే ఏమిటో మరొక్కసారి అందరికీ చాటి చెప్పాడు.