49 Indians Killed in Kuwait Fire Accident: కువైట్ ప్రమాదంపై ప్రధాని మోదీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ, ఒడిశా పర్యటనలు ముగించుకొని ఢిల్లీ చేరుకున్న మోదీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు అగ్రి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కాగా, బుధవారం తెల్లవారుజామున కువైట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మొదట 40మంది భారతీయులు సజీవ దహనమయ్యారని సమాచారం అందింది. తర్వాత మరణించిన భారతీయుల సంఖ్య 49కి చేరిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
తక్షణమే కువైట్ వెళ్లాలి..
కువైట్ నగరంలో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంద్రి కీర్తి వర్ధన్ సింగ్ను ఆదేశించారు. ఈ మేరకు మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తుందన్నారు. బాధితులకు సహాయం చేసేందుకు అధికారులతో కలిసి పనిచేస్తోందని మోదీ చెప్పారు.