Key Changes in Cabinet Sub Committee: గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 317 ద్వారా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా కొలిక్కి తేవాలన్న ఉద్దేశంతో రేవంత్ సర్కార్ మార్చి నెలలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశమయ్యింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు శివశంకర్, రఘునందన్ రావు, జీఏడీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటే.. దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ 14 నుండి జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు లోకల్ స్టేటస్ – ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి భార్య/భర్తలకు కూడా ఆప్షన్ ఇచ్చారు. మల్టీపుల్ అప్లికేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇవ్వబడుతుంది. ఇప్పటివరకు 12 వేల 11 దరఖాస్తులను వెబ్ సైట్ ద్వారా స్వీకరించారు. ఈ దరఖాస్తులను రీ – వెరిఫికేషన్ కు అవకాశం కల్పించారు. ఉద్యోగులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు స్టేటస్ గురించి వారి సెల్ ఫోన్ కు మెసేజ్ రానున్నది.
Also Read: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
కాగా, జీవో 317 జారీ అయ్యి చాలా రోజులవుతుంది. అయినా కూడా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. స్థానికత ఆధారంగా ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో వ్యతిరేకత ఎదురైంది. బదిలీలు, పదోన్నతులు కాకుండా కొత్త నియామకాలు చేపట్టవద్దంటూ అప్పట్లోనే ఉద్యోగులు గత ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. అయితే, ఇప్పటికీ కూడా వారికి పరిష్కారం దొరకలేదు. ఎలక్షన్ కోడ్ ముగియడంతో ఈ అంశంపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. బాధితులు వారి గ్రీవెన్స్ ను ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఒక వైబ్ సైట్ ను కూడా రూపొందించిన విషయం తెలిసిందే.