Odisha CM PA Died in Road Accident: ఒడిశా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మంగళవారం మోహన్ చరణ్ మాఝి ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాజరయ్యారు.
ఇదిలా ఉంటే, మోహన్ చరణ్ మాఝి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ లోని సిరపూర్ లో చందన్ కుమార్ (31) మంగళవారం బైక్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు అతడి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే చందన్ కుమార్ మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
Also Read: భారత్లోని పేదలు, వయానడ్ ప్రజలు.. వీరే నా దేవుళ్లు: రాహుల్ గాంధీ
వేగంగా వచ్చిన ఆ కారు.. మృతుడినే కాదు, మరో ఇద్దరు వాహనదారులను, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. తన పీఏ మృతి గురించి తెలుసుకున్న మోహన్ చరణ్ మాఝి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.