No Seniors in Chandrababu’s New Cabinet Team: ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈసారి తమకు చంద్రబాబు 4.0 కేబినెట్లో చోటు దక్కుతుందని చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అందులో సీనియర్లు లేకపోలేదు. కానీ ఈసారి కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు టీడీపీ అధినేత. ఈ క్రమంలో సీనియర్ నేతలను పక్కన పెట్టారు. ఆశావహుల్లో అసంతృప్తి సహజంగానే ఉంటుంది. ఈ కేబినెట్ను గమనించిన వాళ్లు మాత్రం, మరో 20 ఏళ్లు పాలించేలా చంద్రబాబు ప్లాన్ చేశారని అంటున్నారు.
మంత్రివర్గం ఫస్టాప్లో 17 మంది కొత్తవాళ్లకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. సెకండాఫ్లో మాత్రం సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారన్నది అంతర్గత సమాచారం. ఈసారి బీసీలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కులాల పరంగా చూస్తే.. కమ్మ- 4, రెడ్లకు-3, కాపులు-4, బీసీలకు-8, ఎస్సీలు-2, ఎస్టీ, ముస్లింలకు ఒకొక్కటిగా ఛాన్స్ ఇచ్చారు.
వారిలో రాం ప్రసాద్రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి వంటి నేతలు తొలిసారి గెలిచారు. కేబినెట్లో అడుగు పెడుతు న్నారు. ఇక పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, డోలా వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి 2019లో గెలిచిన నేతలు.
Also Read: మారిన బాబు.. పాలన కూడా మారుతుందా?
ఈసారి చాలామంది సీనియర్లు మంత్రి పదవులను ఆశించారు. యనమల, బుచ్చయ్యచౌదరి, అయ్యన్న, గంటా, ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, సూర్యప్రకాష్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనంద్బాబు ఉన్నారు. కాకపోతే వీరికి సెకండాఫ్లో తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట అధినేత. ఈ రెండున్నర ఏళ్లలో సీనియర్లు తమ వారసులను నియోజకవర్గాల ప్రజలకు పరిచయం చేసి, ప్రజలతో మమేకం అయ్యేలా చూడాలన్నది ఆలోచనగా చెబుతున్నారు సీనియర్లు.
మొదటి నుంచి టీడీపీకి సపోర్టుగా ఉన్న బీసీలకు పెద్ద పీఠ వేశారు చంద్రబాబు. తర్వాత కాపులకు ప్రయార్టీ ఇచ్చారు. అగ్ర కులాలకు ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో సీనియర్లను పక్కన పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విషయంలో జగన్ మాదిరిగా కమ్యూనిటీ ముద్ర వేసుకోకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారని అంటున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతాయని అంటున్నారు. అప్పుడు సీనియర్లను తన జట్టులోకి తీసుకోవచ్చని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు 4.0 కేబినెట్పై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.