Heavy Rains in Telangana Districts: రుతుపవనాల రాకతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పగలంతా ఎండకాసినా సాయంత్రానికి వాతావరణం చల్లబడి.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. భాగ్యనగరమైతే.. భారీ వర్షంలో తడిసి ముద్దవుతోంది. ఇక వర్షంపడితే ఎప్పటిలాగే ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇళ్లకు చేరుకోవడానికి ప్రజలకు గంటల తరబడి సమయం పడుతుంది. ట్రాఫిక్ కష్టాలెందుకని మెట్రోలో వెళ్లేవాళ్లకీ తిప్పలు తప్పడం లేదు. వర్షం పడితే.. మెట్రోని ఆశ్రయించేవారు పెరుగుతున్నారు.
ఇక.. నేడు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం కూడా ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
Also Read: Telangana govt decision: అధికారుల నిర్లక్ష్యం, స్కూల్స్ ఓపెన్, పుస్తకాలు వెనక్కి..
మంగళవారం హైదరాబాద్ సహా.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 6.9 సెంటీమీటర్లు, సిద్ధిపేట జిల్లా వెంకట్రావ్ పేటలో 6.5 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో 6.5 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6 సెంటీమీటర్లు, ఇస్లాంపూర్ లో 5.8సెంటీమీటర్లు, శంకరంపేటలో 5.1సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిద్ధిపేట జిల్లా జప్తిలింగారెడ్డి పల్లికి చెందిన రైతు కడారి శ్రీశైలం (45), మెదక్ జిల్లా సోమక్కపేట గంగిరెద్దులగూడకు చెందిన ఎల్లమ్మ (45) పిడుగులు పడి మరణించారు.