Telangana Schools Re -Opened Today: వేసవి సెలవులు తర్వాత తెలంగాణలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. ముఖ్యంగా తరగతి గదులను సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తొలిరోజు విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని స్కూల్స్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని విద్యార్థులకు ఇవ్వనున్నారు. అయితే ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది. 19 వరకు జరగనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు.
ఇక స్కూళ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఎస్హెచ్జీ గ్రూపుల సభ్యులు, టీచర్లు, ఇతర ఉన్నతాధికారులుంటారు. స్కూల్స్ పరిధిలో చేపట్టే ప్రతీ పనిని ఈ కమిటీల ద్వారా నిర్వహిస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు 600 కోట్ల రూపాయలతో మరమ్మతులు పూర్తి చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ ప్రకటించింది. దీనికి ప్రకారం మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి.
Also Read: రేపు టీఎస్ టెట్ ఫలితాలు విడుదల
జూన్ 12 అంటే బుధవారం నుంచి ఏప్రిల్ 24 వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అక్టోబర్ 13 నుంచి 25 వరకు అంటే దాదాపు 13 రోజులు దసరా సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 క్రిస్మస్, వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ఆరురోజుల పాటు సంక్రాంతి సెలవులుంటాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులకు ప్రతీ రోజూ ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు.