Power Cuts in Several Parts of Delhi: ఓ పక్క హీట్ వేవ్స్.. మరో పక్క నీటి సంక్షోభంతో ఢిల్లీ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతుంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా కరెంట్ కోతలను ఎదుర్కొంటుంది. ఉత్తర ప్రదేశ్ లోని మండోలాలోని పవర్ గ్రిడ్ లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఢిల్లీ ప్రజలకు ఈ కరెంట్ కష్టాలు తప్పడంలేదు. ఈ గ్రిడ్ నుంచే 1500 మెగావాట్ల విద్యుత్ ఢిల్లీ నగరానికి సరఫరా అవుతుంది. అయితే, అగ్నిప్రమాదం జరగడంతో ఢిల్లీ వాసులకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు నీటి ఎద్దడి, మరోవైపు కరెంట్ కష్టాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
‘ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల తరువాత నుంచి కరెంట్ కోతలు ఉన్నాయి. దేశంలో విద్యుత్ సరఫరా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలోనే ఉంది కాబట్టి.. విద్యుత్ శాఖ కొత్త మంత్రి అపాయింట్ మెంట్ కోరుతాను. జాతీయ స్థాయిలో ఇలా ఒక గ్రిడ్ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ గరిష్ఠ వినియోగం 8000 మెగావాట్లకు చేరుకున్న సమయంలో కూడా పవర్ కట్ లేదు. జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’ అంటూ ఢిల్లీ మంత్రి ఆతిశీ కేంద్రాన్ని విమర్శించారు.
Also Read: “మోదీ కా పరివార్” ట్యాగ్పై పార్టీ నేతలకు ప్రధాని కీలక సూచన !
పలు అంశాలపై కేంద్రం నియమించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల నీటి సంక్షోభంపై రెండువర్గాలు విమర్శలు చేసుకున్నాయి. ఢిల్లీ ప్రజలపై హరియాణా ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. అందులో భాగంగానే నీరు విడుదలను తగ్గించిందన్నారు. ఢిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయాలు చేయకూడదని, మిగులు జలాలను సరఫరా చేయాలని హరియాణా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.