Criminal Cases on Modi 3.0 Cabinet Ministers: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే కూటమి భాగస్వామ్యులతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జూన్ 9న ప్రధానితో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి కేబినెట్లో చోటు దక్కగా.. ముగ్గురికి సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది.
అయితే కేంద్రంలో కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులలో దాదాపు 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఒక నివేదికలో ప్రకటించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం, 19 మంది మంత్రులపై హత్యాయత్నం, మహిళలపై నేరాలు, ద్వేషపూరిత ప్రసంగాల వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్.., విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఉన్నారు. వీరిద్దరూ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నానికి సంబంధించిన కేసులను వారి ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
Also Read: ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసుంటే మోదీ ఓటమి పక్కా.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
పలువురు సహాయ మంత్రులపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. వారిలో హోం శాఖ సహాయ మంత్రి (MoS) బండి సంజయ్ కుమార్, శంతను ఠాకూర్, సుకాంత మజుందార్, పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ, గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరమ్ ఉన్నారు.
అదనంగా, ADR నివేదిక ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన కేసులతో ఎనిమిది మంది మంత్రులను గుర్తించింది. మొత్తం 71 మంది మంత్రుల్లో 28 మందిపై(39 శాతం) క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. కొత్త మంత్రి మండలిలోని 71 మంది మంత్రుల్లో డెబ్బై మంది కోటీశ్వరులని, వారిలో సగటు ఆస్తులు రూ. 107.94 కోట్లు అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రి మండలిలో ప్రధాని నరేంద్ర మోదీ సహా 72 మంది సభ్యులు ఉన్నారు.