3 Killed in Pedakakani Road Accident: వాహనదారులు ప్రయాణం చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని.. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా.. రోడ్డుకు ఇరువైపులా అతివేగం ప్రమాదకరమని అడుగడుగునా బోర్డులు ఏర్పాటు చేసినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయి.. కన్నవారికి, కుటుంబ సభ్యులకు కొండంత శోకాన్ని ఇస్తున్నారు.
గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ – కారు – టాటా ఏస్ వాహనాలు ఒకదానినొకటి ఢీ కొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి గాయాలవ్వగా.. వారిని గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు తేజ (20), రాంబాబు (40), మధు (25)గా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.