TTD EO Dharma Reddy Goes on Leave: ఆంధ్రప్రదేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. తెర వెనుక అన్నీ చక్కబెడుతున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్. ఆయన బాధ్యతలు తీసుకున్న నుంచి పాలనలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టే నాటికి పాలనను కొంతలోనైనా గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పనులు చకచకా జరిగిపోతున్నాయి.
కొత్త ప్రభుత్వం రావడంతో సెలవుపై తప్పుకున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్రెడ్డి. ఆయన స్థానంలో నీరబ్కుమార్ బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. ఈనెల చివరిలో జవహర్రెడ్డి పదవీకాలం ముగియనుండడంతో ఈనెల 21న ఆయన విధులకు హాజరుకానున్నారు. బుధవారం ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబునాయుడు ఫ్యామిలీ తిరుమల వెళ్లనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేటి నుంచి వారంరోజుల పాటు సెలవు ఇచ్చేసింది ప్రభుత్వం. ఈవో బాధ్యతలను జేఈవో వీరబ్రహానికి అదనంగా అప్పగించారు.
చంద్రబాబు టూర్ సమయంలో ధర్మారెడ్డి దూరంగా ఉండనున్నారు. రక్షణ శాఖకు చెందిన ఐడీఈఎస్ అధికారి ధర్మారెడ్డి, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. వైఎస్ హయాంలో టీటీడీలో ఓఎస్డీగా రెండుసార్లు డిప్యుటేషన్పై వచ్చారు. తిరిగి జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ డిప్యుటేషన్పై మళ్లీ టీటీడీకి వచ్చారు. ఆయన టీటీడీలోకి వచ్చాక పెత్తనం మొదలైంది. శ్రీవారి దర్శనాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి అవసరమైన పనులు చేయించడానికి ప్రయత్నించారనే ప్రచారం ఆయనపై ఉంది. అంతేకాదు అక్కడి ఉద్యోగులతోపాటు పలువురు రాజకీయ నాయకులను ఆయన వేధించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనను దూరంగా పెట్టినట్టు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
Also Read: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా రామ్ చరణ్
ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు ఫ్యామిలీ తిరుమల రానుంది. 13న దర్శనం తర్వాత అమరావతికి వెళ్లనుంది. ధర్మారెడ్డి విషయంలోనే కాకుండా కేంద్రం నుంచి డిప్యుటేషన్పై వచ్చిన అధికారులను, పొరుగు రాష్ట్రాలను వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం ప్రస్తుతమున్న బాధ్యతల నుంచి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆయా అధికారులు తమ శాఖలకు వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. కాకపోతే సీఎస్ వారికి ఎలాంటి పర్మీషన్ ఇవ్వలేదు. గడిచిన ఐదేళ్లలో లెక్కలు చెప్పాల్సిందేనని అంటున్నారు.