Anurag or Smriti is BJP New President..?: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్డీయేలోని పార్టీల మద్దతు అధికారాన్ని నిలబెట్టుకుంది మోడీ సర్కార్. ఈసారి మోదీ కేబినెట్లో 37మంది పాత మంత్రులను పక్కనపెట్టారు. అందులో 18 మంది ఎంపీగా గెలిచారు. కానీ ఈసారి వారికి మంత్రి పదవులు దక్కలేదు. వాళ్లంతా సెలైంట్గా ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
మోదీ 3.0 కేబినెట్లోకి ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకున్నారు. ఆయనకు వైద్యం శాఖను కట్టబెట్టారు. ఈ క్రమంలో ఆయన అధ్యక్షుడి సీటుకు రాజీనామా చేయవచ్చనే సంకేతాలు బలంగా వున్నాయి. ఆయన ప్లేస్లో యువకుడ్ని అధ్యక్షుడిగా తీసుకొస్తే బాగుంటుందనేది కమలనాథుల ఆలోచన. తొలుత మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, మనోహర్లాల్ ఖట్టర్, సోనావాల్, ధర్మేంద్ర ప్రధాన్ పేర్లు వినిపించాయి. అయితే వారందరినీ మోదీ తన కేబినెట్లోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో హిమాచల్ప్రదేశ్కు చెందిన మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేరు బయటకువచ్చింది. బీజేపీకి ఇప్పడున్న యువనేతల్లో అనురాగ్ ఠాకూర్ ముందు వరుసలో వున్నారు. ముఖ్యంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పలు రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకున్నారు కూడా. ఆయనైతే బెటరని బీజేపీలోని ఓ వర్గం బలంగా చెబుతోంది. కేంద్రమంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కంటే నాలుగైదేళ్లు అనురాగ్ ఠాకూర్ చిన్నవాడని అంటున్నారు.
Also Read: అలా మాట్లాడినందుకే కంగనాను కానిస్టేబుల్ కొట్టింది: పంజాబ్ సీఎం
బీజేపీ అధ్యక్ష రేసులో స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. ఇప్పటివరకు ఆ సీటు కేవలం పురుషులు మాత్రమే అందుకున్నారు. ఈ విషయంలో మహిళలకు బీజేపీ అధ్యక్ష పోస్టు అందని దాక్షగానే మారింది. మహిళల కోసం చాలా పథకాలు తీసుకొచ్చామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పినప్పటికీ, పార్టీలోకి మహిళలకు న్యాయం చేయలేదనే వార్తలూ లేకపోలేదు. ఈసారి స్మృతి ఇరానీకి అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని మరో వర్గం ఆలోచన. మొత్తానికి బీజేపీ అధ్యక్ష రేసులో ఈసారి కొత్తవారు ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.