CM Revanth Reddy on crop loans(TS today news): పంట రుణమాఫీకి సంబంధించిన విధి విధాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరతామని స్పష్టం చేశారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచార అస్త్రం పంట రుణమాఫీ. అయితే ఆగస్టు 15లోపు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా పంట రుణమాఫీతో పాటు ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం పంట రుణమాఫీకి విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రూ. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also Read: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?
కేవలం బ్యాంకు నుంచే కాకుండా.. పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాలని అధికారులకు తేల్చి చెప్పారు.