Appointment Letters to Drug Inspectors: డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలను అందజేశారు. నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదంతో అణిచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైన 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బలోపేతానికి చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదంతో అణిచివేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. నూతనంగా ఎంపికైన 17 మంది డ్రగ్స్ ఇన్ స్పెక్టర్లు శాఖ బలోపేతానికి కృషి చేయాలంటూ ఆదేశించారు. నకిలీ మందుల నివారణకై నిరంతరం పర్యవేక్షించేందుకు నూతనంగా డ్రగ్ ఇన్ స్పెక్టర్ల నియామకాన్ని చేపట్టామంటూ మంత్రి తెలిపారు. బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వర్తించాలని నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
Also Read: నేను కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైనటువంటి ధృవపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించింది. తాజాగా ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ధృవపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధృవపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని అందులో పేర్కొన్నది. కాగా, అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరుస్తామంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.