NDA Alliances Dissatisfaction Over Ministry Allocations: ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిని స్వీకరించడం పట్ల ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ పార్టీ కేబినెట్ బెర్తును ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఆదివారం ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సహాయ మంత్రి పదవిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన మరుసటి రోజే శివసేన అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.
ఈ విషయాన్ని షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ చీఫ్ విప్ శ్రీరంగ్ బర్నే నూతన మంత్రి మండలిలో ఇతర ఎన్డీయే మిత్రపక్షాల నిష్పత్తి ఎత్తిచూపుతూ కేబినెట్ బెర్త్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం వహిస్తున్న లోక్ జనశక్తి పార్టీకి 5 ఎంపీ సీట్లు ఉన్నా కేబినెట్ బెర్త్ ఇచ్చారని.. హిందుస్తాన్ ఆవామి మోర్చా పార్టీలో మాంఝీ ఒక్కరే గెలిచినా అతనికి కేబినెట్ బెర్త్ లభించిందని, కర్ణాటకలోని జేడీయూ పార్టీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని అందులో ఇకరికి కేబినెట్ బెర్త్ లభించిందన్నారు. కానీ శివసేనకు ఏడు ఎంపీలు ఉన్నా సహాయ శాఖ మంత్రి ఇచ్చారని, తమకు కేబినెట్ బెర్త్ కావాలని మనసులోని మాట బయటపెట్టారు బర్నే.
మహారాష్ట్రకు చెందిన ఎన్డీయే మిత్రపక్షమైన అజిత్ పవార్ ఎన్సీపీ శిబిరం కూడా కేబినెట్ మంత్రి కావాలని కుండబద్దలు కొట్టింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు అజిత్ పవార్ వర్గం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ ఇద్దరికి ఇది డిమోషన్ అని.. తమకు కేబినెట్ బెర్త్ కావాలని పార్గీ వర్గాలు డిమాండ్ చేశాయి.
Also Read: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయో తెలుసా..?
కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన ప్రఫుల్ పటేల్, స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రి పదవిని అంగీకరించడం సరికాదని భావించినట్లు అజిత్ పవార్ తెలిపారు. తమకు కేబినెట్ బెర్త్ కావాలని.. అందుకోసం మరికొన్ని రోజులు వేచిచూస్తామని ఆదివారం తెలిపారు.