Mysterious Animal at Rashtrapati Bhavan during Oath: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఈ వేడుక జరిగింది. అయితే, ఈ వేడుకలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యింది. ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుండగా.. ఓ జంతువు స్టేజీ వెనుక భాగంలో కనిపించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రధాని సహా పలువురు కీలకమంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగినంక ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన దుర్గాదాస్ ఉయికె ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న క్రమంలో ఓ జంతువు అటుగా వెళ్లుతున్నట్లు కనిపించింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే ఆ జంతువు సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: అవన్నీ తప్పుడు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ గోపీ..
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఈ వీడియోను చూసి ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అని కొట్టిపారేశారు. తరువాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసినటువంటి యూట్యూబ్ లైవ్ ఫీడ్ ను పరిశీలించగా ఓ జంతువు సంచరిస్తూ కనిపించడంతో నిజమేనని తేలింది. నడుస్తున్న ఠీవిని బట్టి అది పులి అని కొందరు.. కాదు కాదు పిల్లి అయ్యుంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకేదైనా పెంపుడు జంతువు కావొచ్చంటూ ఊహాగానాలూ వెలువడుతున్నాయి. అయితే, దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.