Srinivasa Rao : అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య తెలంగాణలో ప్రకంపణలు రేపింది. గుత్తికోయల కత్తి వేట్లకు బలైన ఎఫ్ఆర్వో ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. పోడు భూముల వివాదంపై ప్రభుత్వ నిర్లక్ష్యమే హత్యకు దారి తీసిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. శ్రీనివాసరావు మరణంతో అటవీ ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. ఆ రోజు నుంచి విధులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు.
ఎఫ్ఆర్వోను దారుణంగా నరికి, గొంతు కోసి చంపేసిన గుత్తికోయలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు, అసలు ఆ గుత్తికోయలు తెలంగాణ వాళ్లే కాదని.. పక్క రాష్ట్రం నుంచి బతుకు దెరువు కోసం వలస వచ్చి ఇంతటి ఘాతుకానికి తెగబడ్డారని అంటున్నారు. అందుకే, ఆ గుత్తికోయలందరినీ గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామసభ నిర్ణయించింది. ఆ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ తీర్మానించింది. వారందర్నీ ఎర్రబోడు నుంచి ఛత్తీస్గఢ్కు తరలించాలని తీర్మానంలో తెలిపింది.
ఇక, తమకు భద్రత కల్పించాలటూ, ఆయుధాలు ఇవ్వాలంటూ.. విధులు బైకాట్ చేసి నిరసన తెలుపుతున్న అటవీ ఉద్యోగులతో.. ఆ శాఖ ఉన్నతాధికారి డోబ్రియాల్ చర్చలు జరిపారు. సిబ్బంది తిరిగి విధుల్లో పాల్గొనాలని కోరారు. ఉద్యోగుల భద్రత, రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయుధాలు, ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. గొత్తికోయల వల్ల అడవికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని.. పోడు సమస్య పరిష్కారానికి కృషి చేస్తోందని డోబ్రియాల్ అన్నారు. అయితే, తిరిగి విధుల్లో చేరడంపై అటవీ సిబ్బంది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.