Gujarat BJP: తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందంటూ ఇప్పటికే గులాబీ నేతలు పదే పదే విమర్శలు చేస్తుంటారు. వారికి మరో ఛాన్స్ ఇచ్చేలా.. గుజరాత్ బీజేపీ మరో తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టేసింది. బీజేపీని గెలిపిస్తే.. విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. గత ఎన్నికల్లో కేజీ టూ పీజీ ఉచిత విద్యకు హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటి వరకూ ఆ హామీని నెరవేర్చనే లేదు. దీనిపై కమలనాథులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు కూడా. ఇప్పుడు ఇదే హామీని.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఉచితాలు వద్దంటూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదంటూ.. ప్రధాని మోదీ ఇటీవల పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఉచితాలపై పరోక్షంగా ఆప్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, గుజరాత్ ఎన్నికల సందర్భంగా.. పలు ఉచిత హామీలు ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది.
అభివృద్ధి, భద్రతకూ పెద్దపీట వేసింది బీజేపీ మేనిఫెస్టో. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. గుజరాత్ లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని.. ఉగ్రవాద ముప్పు నుంచి భద్రత కల్పిస్తామని.. ఇలా పలు హామీలు ప్రకటించింది. గాంధీనగర్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్లు మేనిఫెస్టోను విడుదల చేశారు.
బీజేపీ మేనిఫెస్టో హామీలు:
–వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు
–వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
–విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
–10వేల కోట్లతో 20వేల ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి
–మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు
–10వేల కోట్లతో రైతులకు మౌలికసదుపాయాల కల్పన
–గుజరాత్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు
–ఉగ్రవాద ముఠాల స్లీపర్సెల్స్ను గుర్తించి నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్
–ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం 5లక్షల నుంచి 10లక్షలకు పెంపు