Rishi Sunak: రిషి సునాక్. బ్రిటన్ ప్రధానిగా ఆయన పేరు మారుమోగిపోతోంది. 200 ఏళ్ల పాటు భారత్ ను పాలించిన బ్రిటన్ దేశానికి.. ఇప్పుడు భారత మూలాలున్న రిషి సునాక్ పాలిస్తుండటం భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోంది. లండన్ లో పుట్టి పెరిగినా.. ఇండియా అన్నా.. మన సంప్రదాయాలన్నా విపరీత అభిమానం ఆయనకి. రిషి భార్య అక్షతామూర్తి సైతం అంతే. అందుకే, వారి పిల్లలకు సైతం మన దేశ సంస్కృతి, అలవాట్లు బాగా అలవాటయ్యాయి. రిషి-అక్షతల కూతురు అనౌష్క.. ఎప్పటినుంచో భారతీయ సంప్రదాయ నృత్యం కూచిపూడి నేర్చుకుంటున్నారు. తాజాగా, లండన్ లో కూచిపూడి ప్రదర్శన కూడా ఇచ్చారు.
లండన్లో ‘రాంగ్ – 2022’ పేరుతో ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో రిషి కుమార్తె అనౌష్క సునాక్ సైతం మరికొందరు చిన్నారులతో కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. కూతురి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేందుకు.. రిషి భార్య అక్షతామూర్తి, సునాక్ పేరెంట్స్ కూడా తరలివచ్చారు. అనౌష్క కూచిపూడి ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురిగా.. అనౌష్క చేసిన నృత్యం సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
డ్యాన్స్ అంటే తనకు ఎంతో లైక్ అని.. భారత్కు వెళ్లడం కూడా చాలా ఇష్టమని చెబుతోంది అనౌష్క.