Twitter Tick in 3 Colours : బ్లూ టిక్ సేవల్ని వీలైనంత త్వరగా ప్రారంభించి యూజర్ల దగ్గర నెలవారీ ఛార్జీల కింద నెలకు 8 డాలర్లు వసూలు చేయాలని భావిస్తున్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్… ఆ సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలకు వేర్వేరు రంగుల్లో టిక్ మార్క్లు కేటాయిస్తామని చెప్పారు. వచ్చే వారమే ఈ సేవల్ని పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు… మస్క్.
డిసెంబరు 2 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వెరిఫైడ్ ప్రక్రియను ప్రారంభిస్తామని మస్క్ తెలిపాడు. కంపెనీలకు గోల్డ్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే, వ్యక్తులకు బ్లూ టిక్ ఇస్తామని వెల్లడించాడు. ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వెరిఫైడ్ టిక్ను కేటాయిస్తామని మస్క్ ట్వీట్ చేశారు. ఇతర పూర్తి వివరాలను వచ్చేవారం వెల్లడిస్తామన్నారు. విద్వేష వార్తల కట్టడినీ ట్వీట్లో ప్రస్తావించిన మస్క్… హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు.
ఇంతకుముందు ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీ తారలు, ఇతర సెలబ్రిటీల ఖాతా వివరాలను తనిఖీ చేశాక ట్విట్టర్ బ్లూ టిక్ ఇచ్చేది. సంస్థ మస్క్ చేతుల్లోకి వచ్చాక ఈ ఫీచర్లో మార్పులు చేశారు. నెలకు 8 డాలర్ల ఫీజు ప్రకటించి, ఎలాంటి తనిఖీలు చేయకుండా బ్లూ టిక్ ఇచ్చేశారు. దీంతో నకిలీ ఖాతాలు భారీగా కనిపించాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మస్క్ తాత్కాలికంగా ఆ సేవలను నిలిపివేశాడు.
మరోవైపు… అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ట్విటర్ ఖాతా పునరుద్ధరించి వారం రోజులు కావొస్తున్నా ఆయన ఒక్క పోస్టు కూడా చేయలేదు. ఓ నెటిజన్ ఈ అంశాన్ని ప్రస్తావించగా… ట్రంప్ ట్వీట్ చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉందని సమాధానమిచ్చాడు… మస్క్. ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడకపోయినా ట్రంప్ ఖాతాను నిషేధించారని, ఇది ఘోర తప్పిదమని, దాన్ని సరిచేయడమే తనకు ప్రధానమన్నాడు… మస్క్. అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఖాతాను ట్విట్టర్ నిషేధించడంతో సగం మంది అమెరికన్లు ఆ సంస్థపై విశ్వాసం కోల్పోయారని మస్క్ అభిప్రాయపడ్డాడు.