Rishi Sunak : బ్రిటన్కు భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని అయినప్పటికీ భారతీయులకు వీసా విషయంలో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది. బ్రిటన్లో అక్కడి సిటిజన్స్తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉంటారు. వీరి సంఖ్య బ్రిటన్లో క్రమక్రమంగా పెరుగుతోంది. విదేశీ వలసల కారణంగా బ్రిటన్ పౌరులతో పాటు, ప్రభుత్వం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని సమాచారం. ఈ వలసలను నియంత్రించడానికి రిషి సునక్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
బ్రిటన్కు ప్రతీ ఏడాది వచ్చే వలసల్లో అధికశాతం విద్యార్ధులే ఉంటున్నారు. కాబట్టి విద్యార్ధులపైనే మొదట కఠినమైన ఆంక్షలను విధించాలనుకుంటుంది రిషి సునక్ ప్రభుత్వం. సాధారణ డిగ్రీల కోసం వచ్చే విద్యార్ధులను బ్రిటన్ రానివ్వకుండా ఆంక్షలను విధించాలనుకుంటున్నారు. అటు డిపెండెంట్ వీసాపైన ఉంటున్న వారిపైనా నిబంధనలు విధించనున్నారు. 2021లో వలసల సంఖ్య 1.73 లక్షలు ఉంటే..అది 2022కు 5 లక్షలకు చేరుకుంది. ఈ సంఖ్య ఇప్పుడు బ్రిటన్ పాలకులను, అక్కడి మేధావులను ఆందోళనకు గురిచేస్తుంది.
విద్యార్ధులపై వీసా ఆంక్షలు కఠినతరం చేస్తే నష్టపోయేది బ్రిటన్ దేశమే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్లో ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్ధులే అధిక సంఖ్యలో ఉన్నారు. బ్రిటన్ వచ్చే విద్యార్ధులను పరోక్షంగా అడ్డుకుంటే నష్టపోయేవి ఆ విశ్వవిద్యాలయాలే అని అంటున్నారు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే యూనివర్సిటీలు దివాలా తీసినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.