Jasprit Bumrah is Game Changer in ICC T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే.. తనని గేమ్ ఛేంజర్ అని ఎందుకన్నారో.. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ లో అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఒక ‘లో స్కోరు మ్యాచ్’ని ఎలా గెలవాలి? అని తను బౌలింగ్ చేసి నిరూపించాడు. ఒకరకంగా చెప్పాలంటే 119 పరుగుల స్కోరుని.. కాపాడుకోవాలి, గెలవాలని అనుకోవడం అత్యాశే అవుతుంది.
కానీ.. అక్కడ ఎవరున్నారు? పట్టు వదలని విక్రమార్కుడు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. తన మనోబలమే.. మ్యాచ్ ని గెలిపించిందని నెటిజన్లు అంటున్నారు. ఇది ప్రతీ ఒక్కరికి కావాలని అంటున్నారు. విజయం ఎప్పుడూ ఓటమి చివరి అంచునే లభిస్తుందని, జీవితంలో కూడా చివరి బాల్ వరకు ఎదురుచూడాల్సిందే, పోరాడాల్సిందేనని, అందుకు మన టీమ్ ఇండియా ఒక ఉదాహరణ అని కొనియాడుతున్నారు.
కెప్టెన్ రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టి, గేమ్ ఛేంజర్ గా మారినవాడు మరెవరో కాదు.. టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. నిజానికి తన స్పెల్ లో వేసిన తొలి ఓవర్ లోనే రిజ్వాన్ లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చాడు. అయితే దానిని.. శివమ్ దుబె నేల పాలు చేశాడు. లేకపోతే పాకిస్తాన్ 100లోపే ఆలౌట్ అయ్యేది. అప్పటికి అర్షదీప్, సిరాజ్ బౌలింగ్ చేశారు. వికెట్లు రాలేదు. కానీ బుమ్రాకే వచ్చింది. కానీ అది డ్రాప్ అయ్యింది. అందుకే తెలివిగా 5వ ఓవర్ అర్షదీప్ సింగ్ కి కాకుండా బుమ్రాకి ఇచ్చాడు.
Also Read: ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ వారసుడు, అల్కరాస్ విజేత..
నిజానికి ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఇద్దరూ చక్కగా, సాధికారికంగా ఆడుతున్నారు. ఆ క్రమంలో టీమ్ ఇండియాకి ఒక వికెట్ కావాలి. ఎందుకంటే ఇది ‘లో స్కోరు గేమ్’కావడంతో వికెట్లు పడాలి. లేదంటే మ్యాచ్ ని కాపాడుకోలేం. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అది జరగాలంటే వికెట్ కావాలి.
బాబర్ ఆజామ్ కి స్లిప్ లో అవుట్ కావడమనే బలహీనత ఉంది. అందుకే అక్కడికి సూర్యకుమార్ ని తీసుకొచ్చాడు. బూమ్రాకి బాల్ ఇచ్చాడు. తను పదేపదే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వేయడంతో ఒక బాల్ ని బాబర్ అన్యాపదేశంగా ఆడి.. స్లిప్ లో సూర్యకుమార్ కి దొరికిపోయాడు. అయితే ఆ బాల్ ని సూర్య అద్భుతంగా పట్టుకునే సరికి, పాకిస్తాన్ కి పిచ్ నుంచి ట్రబుల్స్ మొదలయ్యాయి. ఇక్కడే మ్యాచ్ టీమ్ ఇండియావైపు మొగ్గు చూపింది.
మళ్లీ 10 ఓవర్ వరకు వికెట్ లేదు. అక్షర్ పటేల్, పాండ్యా వికెట్లు తీశారు. కానీ అటువైపు ప్రమాదకరమైన రిజ్వాన్ ఉండిపోయాడు. దీంతో మళ్లీ 14 ఓవర్ లో బుమ్రా వైపు కెప్టెన్ రోహిత్ శర్మ చూశాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకునే బుమ్రా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రిజ్వాన్ బలహీనతలపై బాల్ వేస్తూ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ వేయడంతో.. వికెట్లు ఎగిరిపడ్డాయి. రిజ్వాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మళ్లీ చివర్లో 18వ ఓవర్ జరుగుతోంది. బుమ్రా స్పెల్ లో చివరి ఓవర్ అది.. అది అద్భుతంగా బౌలింగ్ చేసి, కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి, టార్గెట్ ని కంట్రోల్ చేశాడు. అంతేకాదు చివరి బంతికి మరో వికెట్ తీశాడు. అంతే స్టేడియం హోరెత్తిపోయింది. 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి పాకిస్తాన్ లో కీలకమైన 3 వికెట్లు తీశాడు. అలా టీమ్ ఇండియాని ఒంటిచేత్తో గెలిపించాడు. టీ 20 ప్రపంచకప్ లో ముందుకు సాగేలా చేశాడు.
నిజానికి మామూలు డెడ్ పిచ్ లపైనే స్వింగ్ ని రాబట్టే, బుమ్రాకి.. ఇలాంటి బౌలింగ్ పిచ్ ని ఇచ్చి బౌలింగ్ చేయమంటే ఎలా ఉంటుంది. అలాగే ఉంటుంది. అట్లుంటది మనోడితోని.. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.