37 Ministers Dropped from Modi’s New Cabinet: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ కేబినెట్ కొలువుదీరింది. కొందరేమో 3.0 అని, మరికొందరు నెహ్రా రికార్డును సమం చేశారని అంటున్నారు. ఆ విషయాన్ని కాసేపు పక్కనపెడదాం. ప్రధాని నరేంద్రమోదీ ఈసారి ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.
తాజాగా మోదీ కేబినెట్లో 37 మందికి పాత మంత్రులకు చోటు దక్కలేదు. అందులో మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకారం రోజున మాజీ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటన ఇచ్చేశారు. దీంతో కమలనాథుల్లో అసంతృప్తి మొదలైనట్టు కనిపిస్తోంది.
అందులో ఏడుగురు కేబినెట్ హోదా వ్యక్తులు కాగా, మిగతావాళ్లంతా సహాయ మంత్రులున్నారు. చాలా సందర్భాల్లో మంత్రి పదవులు ఇచ్చి, ఆ తర్వాత వాళ్లని రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. ఈసారి వాళ్ల సీట్లకు కోతపడడం ఖాయమంటున్నారు. 37 మంది మాజీ మంత్రుల్లో 18 మంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక తమిళనాడుకి చెందిన మురుగన్ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన ఒక్కరే తన పదవిని నిలబెట్టుకున్నారు.
మరోవైపు ఎన్డీయే మిత్రుల్లోనూ లుకలుకలు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గం కేబినెట్ పదవి కావాలని పట్టుబట్టింది. అందుకు బీజేపీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరకు ఇచ్చిన పదవితో సరిపెట్టుకుంది. ఇదికాకుండా ఈనెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నాటికి ఇప్పుడున్న అసంతృప్తులు పెరగవచ్చని అంటున్నారు.
ALSO READ: నమో 3.0.. ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ లైఫ్ జర్నీ
అదే జరిగితే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చెప్పిన మాటలు అక్షరాలా నిజం కావడం ఖాయమన్నమాట. త్వరలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆమె ఓపెన్గా చెప్పేశారు. రేపటి రోజున బీహార్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలితే ఎన్డీయేకు కష్టాలు తప్పవన్నమాట.