PM Modi Life Journey: నమో 3.0 లేటెస్ట్ వెర్షన్ విత్ అలియెన్స్తో ముందుకు వచ్చారు మోదీ. ప్రపంచమంతా ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. ప్రధానిగా మూడోసారి మోదీ పట్టాభిషేకం.. యావత్ ప్రపంచానికి శాంతి, స్నేహ సంకేతాల్ని చాటింది. ఈ తరుణంలో మోదీ జర్నీ ఇప్పుడు చాలా మందిలో చర్చగా మారింది. ఒక సామాన్యమైన వ్యక్తి అసమాన్యుడిగా ఎదగడం స్పూర్తిదాయకమనే చెప్పాలి.
గుజరాత్లోని మెహసానా జిల్లా వాద్నగర్లో 1950 సెప్టెంబరు 17న జన్మించారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మధ్యతరగతి కుటుంబంలోనే పెరిగారు. నేడు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరి స్వయంసేవక్గా పనిచేశారు మోదీ. ఆ సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. అతికొద్దికాలంలోనే బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించారు. మోదీని ఎల్కే ఆడ్వాణీ ప్రోత్సహించారు. 1990లో ఆడ్వాణీ రథయాత్రలో మోదీ పాల్గొన్నారు. 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కశ్మీర్ ఏక్తా యాత్రకు మోదీ జాతీయ ఇన్చార్జిగా పనిచేశారు.
సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. 23 సంవత్సరాల క్రితం.. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మోదీ వయసు 51 ఏళ్లు. గుజరాత్లో వరుసగా 3సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి 12 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు.
Also Read: మోదీ ప్రమాణస్వీకారం వేళ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
గోద్రా అల్లర్ల సమయంలో మోదీ తీరుపై తీవ్రవిమర్శలొచ్చాయి. ఎన్డీయే మిత్రపక్షాల నుంచి సైతం సీఎం పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. అయినప్పటికీ 2014 మేలో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టేంత వరకూ మోదీ గుజరాత్ సీఎంగా పనిచేశారు. తన హయాంలో వరుసగా 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలిపించారు మోదీ.
2014 వరకు కేవలం గుజరాత్ రాష్ట్రానికే పరిమితమైన మోదీ.. 2014 ఎన్నికల నాటికి ఒక్కసారిగా భారత ప్రజల ముందుకు వచ్చారు. ఆయన మేనియాతో.. 2014లో కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. 2019లో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు. 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలి.. మరో 5 ఏళ్లు ఇది మోదీ అడ్డా అని చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా ప్రధాని మోదీ అనేక దేశాలను సందర్శించారు. ప్రపంచంలో భారత్ను ఆ స్థానానికి తీసుకొచ్చారు ప్రధాని మోదీ. భారత్తో స్నేహ సంబంధాలను ఏర్పరచుకునే దిశగా అన్ని దేశాలు ముందుకు సాగుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఇప్పుడు గుర్తింపు పొందింది.
వరుసగా 3సార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ సమం చేశారు. కాంగ్రేసేతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి మోదీనే. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. 1952లో తొలిసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. వరుసగా.. 1957, 1962 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ఆయన విజయపథాన నడిపించి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీకి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. మొత్తంగా ముచ్చటగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారంతో దేశవ్యాప్తంగా కాషాయ సంబరాలు అంబరాన్నంటాయి.