Rahul Gandhi Comments : మోదీ ప్రమాణస్వీకారం వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధిక సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. రాష్ట్రపతి భవన్ లో మోదీ భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు పలువురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడే కేంద్రప్రభుత్వంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ – యూజీ పరీక్ష-2024లో అవకతవకలు జరిగాయంటూ ఆయన ఆరోపించారు. విద్యార్థుల తరఫున ఈ అంశంపై పార్లమెంటులో గళమెత్తుతామన్నారు.
నీట్ పరీక్షల్లో లోపాల కారణంగా సుమారు 67 మందికి ప్రథమ ర్యాంక్ రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Also Read: పండగలా ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం.. ప్రముఖులతో కిక్కిరిసిన రాష్ట్రపతి భవన్
మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్ పరీక్షల కారణంగా 24 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలను నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకే పరీక్షా కేంద్రంలోని ఆరుగురు విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా మంది విద్యార్థులకు టెక్నికల్ గా సాధ్యం కాని విధంగా మార్కులు ఎలా వచ్చాయి. అదెలా సాధ్యమవుతుంది. అయినా కూడా నీట్ పరీక్ష లీక్ అయ్యిందని కేంద్రం ఒప్పుకోవడంలేదు. పేపర్ లీకేజీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బలమైన ప్రణాళికను రూపొందించింది. పేపర్ లీకేజీలు కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా చట్టం తెస్తే ఆ సమస్య మరోసారి పునరావృతం కాదు. లోక్ సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతా. ఈరోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ పార్లమెంటులో మీ వాయిస్ గా మారుతాను. మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని హామీ ఇస్తున్నాను’ అంటూ రాహుల్ గాంధీ అందులో పేర్కొన్నారు.